Controvesial Commenst: మోదీని అవమానిస్తూ కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలు... భగ్గుమన్న కాషాయ నేతలు

20 Jun, 2022 19:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ మంటల్లో రాజకీయ నాయకులు చలికాచుకుంటున్న తీరుగా వ్యవహారం తయారైంది. పథకంలోని లోపాలేంటి, చేపట్టాల్సిన చర్యలేంటి? అనే సంగతి మరచి రాజకీయ నాయకులు పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్నారు. స్థాయి మరచి దూషణలకు దిగుతుండటంతో విషయం పక్కదారి పట్టేలా ఉంది! తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌ కాంత్‌ సహాయ్‌ ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిట్లర్‌ మాదిరిగా మొండిగా ముందుకెళ్తే.. ఆయనకు పట్టిన గతే పడుతుందని సుబోధ్‌ సోమవారం ఓ సభలో వ్యాఖ్యానించారు.  
చదవండి👉 తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత..

ఇక మోదీపై అనుచిత వ్యాఖ్యలపట్ల జార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ స్పందించారు. నోటి దురుసుగా మాట్లాడటం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని దుయ్యబట్టారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో సోనియాగాంధీ కూడా ఇలాగే నోరుపారేసుకున్నారని, ఆయనను అవమానించిన కాంగ్రెస్‌ ఏపాటి లాభపడ్డదో గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్‌ విపరీత వ్యాఖ్యలపట్ల కన్నెర్ర జేసిన గుజరాత్‌ ప్రజలు మరోసారి మోదీకి అఖండ​ మెజారిటీ కట్టబెట్టారని రఘుబర్‌దాస్‌ చెప్పుకొచ్చారు.

మోదీపై అభిమానంతోనే జనం ఆయనను ప్రధానిగా వరుసగా గెలిపిస్తున్నారని, కాంగ్రెస్‌ నీచ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. విర్రవీగి మాట్లాడితే కాంగ్రెస్‌ ఎప్పటికీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని మరికొందరు బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కాగా, తాత్కాలిక ప్రాతిపదికన రక్షణ రంగంలో నియామకాలకు కేంద్రం తెచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
చదవండి👉 ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా 24న దేశ్యవాప్త నిరసన

మరిన్ని వార్తలు