రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంజయ్ రౌత్.. కాంగ్రెస్‌తో తెగదెంపులు లేనట్టే?

21 Nov, 2022 14:59 IST|Sakshi

ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా గతవారం వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడితే అవసరమైతే కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటామని శివసేన హెచ్చరించింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఇది స్ఫష్టమవుతోంది.

సోమవారం ట్వీట్‌ చేసిన రౌత్.. రాహుల్ గాంధీ తనకు ఆదివారం ఫోన్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు వివరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాహుల్ తనతో మాట్లాడారని రౌత్ చెప్పుకొచ్చారు. తాను జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలోని తన మిత్రులు సంబరపడ్డారని విమర్శించారు. వాళ్లు మొగలుల కాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్‌ తమతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నట్లు రౌత్ పేర్కొన్నారు. ప్రేమ, కరుణపైనే ప్రధానంగా దృష్టి సారించి ఆయన చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కొనియాడారు. రౌత్ వ్యాఖ్యలను గమనిస్తే మహావికాస్ అఘాడీకి బీటలు పడే అవకాశాలు లేనట్లే కన్పిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

చదవండి: మెగాస్టార్‌పై ప్రధాని ప్రశంసల వర్షం.. తెలుగులో ట్వీట్‌ చేసిన మోదీ

మరిన్ని వార్తలు