వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనందప్రకాష్ డిమాండ్
పశ్చిమగోదావరి ,పాలకొల్లు అర్బన్: తన పర్యటనకు అడ్డు తగిలితే గన్తో కాల్చి పారేస్తానని బహిరంగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బెదిరిస్తున్న నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజుపై హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని సుమోటోగా అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనందప్రకాష్ డిమాండ్ చేశారు. పాలకొల్లు ఏఎంసీ ఆవరణలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవిలో ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తూ టీవీల్లోనూ, సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటనలు చేస్తున్న ఎంపీ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని త్వరలోనే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పుకుంటున్న ఎంపీ దమ్ముంటే నియోజకవర్గ పర్యటనకు రావాలని ఆనందప్రకాష్ సవాల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహ జ్వాలలకు ఎంపీ కనుమూరు గురికాక తప్పదని హెచ్చరించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రోజుకో కులాన్ని విమర్శిస్తూ తాను ఎంపీనని మరచిపోయి మాట్లాడడం విచారకరమన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఎం మైఖేల్రాజు, జడ్పీటీసీ అభ్యర్థి నడపన గోవింరాజుల నాయుడు, పార్టీ నాయకులు చినిమిల్లి గణపతిరావు, కోరాడ శ్రీనివాసరావు, సాలా నరసయ్య, కుంచిలపల్లి వినిస్టన్బాబు, కొర్రగింజల హనుమంతరావు, ఉండ్రాజవరపు రవిబాబు, సనమండ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.