అగ్రి గోల్డ్‌ బాధితులకు అండగా ప్రభుత్వం

23 Aug, 2021 03:29 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

సాక్షి, అమరావతి: పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఆదుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఈ నెల 24న రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయనుందని తెలిపారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19 వరకూ 7.76 లక్షల మంది డిపాజిట్‌దారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి ఇప్పటికే రూ.240 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న 1995లో అగ్రి గోల్డ్‌ సంస్థ భారీ ఎత్తున డిపాజిట్లను సేకరిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. డిపాజిట్‌దారులకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 2015లో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం బోర్డు తిప్పేస్తే.. ఆ యాజమాన్యంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తమ పోరాటాల వల్లే అగ్రి గోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం నగదు చెల్లిస్తోందని చంద్రబాబు, టీడీపీ నేతలు బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అగ్రి గోల్డ్‌ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. 

మరిన్ని వార్తలు