స్వప్రయోజనాల కోసం దిగజారే బాబు వల్లే శ్రీదేవికి హాని 

27 Mar, 2023 04:14 IST|Sakshi

మీరు చేసిన తప్పు పనికి, కులానికి సంబంధం ఏంటి?

ఓటు అమ్ముకోమని అంబేడ్కర్‌ ఏమైనా చెప్పారా?

టీడీపీకి అమ్ముడు పోకపోతే ధైర్యంగా నిలబడవచ్చు కదా..!

3 రోజుల తర్వాత హైదరాబాద్‌లో మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 

టీడీపీ స్క్రిప్ట్‌ ఇప్పుడే అందిందా?

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఎంపీ నందిగం సురేశ్‌ ఆగ్రహం

శ్రీదేవి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. క్రాస్‌ ఓటింగ్‌ చేశారని నిరూపిస్తానని వెల్లడి  

సాక్షి, అమరావతి: ‘క్రాస్‌ ఓటింగ్‌ చేయలేదని, ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సవాల్‌ చేశారు. ఆమె సవాల్‌ను స్వీకరిస్తున్నా. శ్రీదేవి ఓటు అమ్ముకున్నారనేది వాస్తవం. ఆమె అమ్ముడుపోయి టీడీపీకి ఓటు వేశారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేశ్‌ చెప్పారు. మహిళలను గౌరవించే పార్టీ వైఎస్సార్‌సీపీ అని.. తమ వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదన్నారు. స్వప్రయోజనాల కోసం ఎంతవరకైనా దిగజారే చంద్రబాబు వల్లే ఆమెకు హాని పొంచి ఉంటుందన్నారు.

ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘నిజంగా తప్పు చేయకపోతే.. ధైర్యంగా నిలబడొచ్చు కదా? మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఎందుకు మాట్లాడారు? టీడీపీ స్క్రిప్ట్‌ ఇప్పుడే అందిందా?’ అని ఉండవల్లి శ్రీదేవిని సురేశ్‌ ప్రశ్నిం చారు. సీఎం జగన్‌ చాలా గొప్ప వ్యక్తి అని మీడియాతో చెప్పారు కదా.. మరి అలాంటి వ్యక్తిని మోసం చేయాలన్న ఆలోచన ఎలా వచి్చంది? అని మండిపడ్డారు. చేసిన తప్పు పనికి, కులానికి సంబంధమేంటని ప్రశ్నిం చారు.

ఓటు అమ్ముకోమని అంబేడ్కర్‌ ఏమైనా చెప్పారా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె ఓటు అమ్ముకోవడం వాస్తవమని.. ఎవరితో ఎక్కడ, ఎలా రాయబారాలు చేసిందో తమకు తెలుసన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహించాలంటూ శ్రీదేవి ఆరోపించడం దారుణమని మండిపడ్డారు. ఆమెకు ప్రమాదం పొంచి ఉందంటే.. అది కచ్చితంగా టీడీపీ వల్లే అని చెప్పారు. అందుకే శ్రీదేవికి పటిష్ట భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు.  

జగన్‌ ప్రభుత్వం వల్లే దళితులకు ఎంతో మేలు.. 
సీఎం జగన్‌ పాలనలో దళితులకు ఎంత మేలు జరుగుతోందో అందరికీ తెలుసని ఎంపీ నందిగం సురేశ్‌ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఎస్సీలకు ప్రాధాన్యం కలిగిన మంత్రి పదవులు ఇచ్చారా? దళితులను హోం మంత్రి చేశారా? అని ప్రశ్నిం చారు. అమరావతిలో ఏదో అన్యాయం జరిగిపోయిందని ఇప్పుడు మాట్లాడుతున్న శ్రీదేవి.. గతంలో అమరావతి అంశం గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు.

అలాగే మిమ్మల్ని ఉద్దేశించి టీడీపీ వాళ్లు ఏమన్నారో కూడా గుర్తు చేసుకోవాలన్నారు. మీదంతా మేకప్‌.. ప్యాకప్‌.. మీరెప్పుడూ బ్యూటీ పార్లర్లలో ఉంటారంటూ టీడీపీ వాళ్లు దిగజారి చేసిన మాటలు గుర్తున్నాయా? అని ప్రశ్నిం చారు. గతంలో చంద్రబాబును నమ్మి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే ఇప్పుడు వెళ్లిన ఆ నలుగురు కూడా సరిగ్గా అక్కడే, అలాగే ఉంటారని చెప్పారు. స్కామ్‌లంటూ శ్రీదేవి ఆరోపిస్తున్న వాటిపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు.   

మరిన్ని వార్తలు