చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరంపై కేంద్రం కొర్రీలు

27 Oct, 2020 02:21 IST|Sakshi

కేంద్రం ప్యాకేజీని ఆయన ఆమోదించడమే ప్రాజెక్టుకు శాపం

విభజన చట్ట ప్రకారం కేంద్రమే ప్రాజెక్టును నిర్మించాలి

ప్రధానిని సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా కలిసి వివరిస్తారు

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వ్యయంపై కేంద్రం వేస్తున్న కొర్రీలకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని చంద్రబాబు నిస్సిగ్గుగా ఆమోదించడం వల్లే నేడు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం వివాదంలో పడిందన్నారు. విభజన చట్ట ప్రకారం కేంద్రమే పోలవరం ప్రాజెక్టును నిరి్మంచాల్సి ఉండగా, దానిని కేంద్రం ప్యాకేజీ పరిధిలోకి తెచి్చనప్పుడు టీడీపీ ప్రభుత్వం స్వాగతించి పెద్ద తప్పు చేసిందని, ఇప్పుడదే పోలవరం పాలిట శాపంగా మారిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అంగీకరించదని, పోలవరంపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధానికి లేఖ రాస్తున్నారని వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్‌ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

► పోలవరం ప్రాజెక్టుకు తమ హయాంలో అద్భుతంగా నిధులను తెచ్చామని టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలాడుతున్నారు.  
► అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా నిర్వాకం వల్లనే ఇప్పుడు పోలవరానికి  ఇబ్బందులెదురవుతున్నాయి. ఈ విషయాలను మేం పూర్తి ఆధారాలతో ప్రజల ముందుంచుతున్నాం.  
► విభజన చట్ట ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్రమే నిరి్మంచాలని ఉంటే కేవలం కమీషన్ల కోసం తామే నిరి్మంచుకుంటామని చంద్రబాబు ముందుకొచ్చారు. గత ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టుపై చేసిన వ్యయం రూ.265 కోట్లు మాత్రమే.  
► టీడీపీ సర్కార్‌ 2016లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు సంబరాలు చేసుకోవడమే కాక అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. ప్యాకేజీ పరిధిలోకి ప్రాజెక్టును తీసుకురావడం కుదరదు. టీడీపీ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్యాకేజీని అంగీకరించింది.  
► ఆరోజు కేంద్ర ఆరి్థక శాఖ జారీ చేసిన మెమోలో 2013–14 వరకూ పోలవరం నిర్మాణంలో ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ వ్యయం మాత్రమే ఇస్తామని ప్రకటించింది. దీన్ని చంద్రబాబు అంగీకరించడం పెద్ద తప్పిదం. వైఎస్‌ జగన్‌ కూడా నాడు అసెంబ్లీలో ఇదే చెప్పారు.  
► టెక్నికల్‌ అడ్వయిజరీ బోర్డు అంచనా ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ.20 వేల కోట్ల నుంచి రూ. 55 వేల కోట్లకు పెరిగింది. నిర్మాణం ఖర్చు తగ్గినా, పెరిగినా చట్ట ప్రకారం భరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణంలో సమన్వయకర్త పాత్ర మాత్రమే పోషిస్తోంది.     
► 2017 మార్చిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 2014 నాటి సవరించిన అంచనాల ప్రకారమే ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ వ్యయాన్ని కేంద్రం ఇస్తుందని, 2014 తర్వాత అంచనా వ్యయాల పెరుగుదలను కేంద్రం భరించదని చాలా స్పష్టంగా తీర్మానించారు. 2010–14 వరకు భూసేకరణ కోసం ఇచ్చిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని చెప్పారు. దానికన్నా వ్యయం పెరిగితే కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఆ మంత్రివర్గంలో టీడీపీకి చెందిన అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి కూడా ఉన్నారు. అంటే దీని అర్థం టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందనే కదా..! అందుకు ఆనాడు చంద్రబాబు ఒప్పుకోవడం కన్నా మించిన దుర్మార్గం ఉందా..? రాష్ట్రమే పోలవరం కట్టేస్తుందని చంద్రబాబు ప్రకటనలు చేశారు.  
► 2018లో ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖలో 30.9.2016 మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ మెమో ప్రకారం పోలవరానికి తొందరగా నిధులు ఇవ్వాలని కోరడం వాస్తవం కాదా? సవరించిన సీడబ్ల్యూసీ అంచనా ప్రకారం రూ.48వేల కోట్లు అయితే ఇందులో రూ.29 వేల కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌కే ఖర్చు చేయాల్సి ఉంది. ఇవన్నీ కాదని ఆనాడు చంద్రబాబు కేంద్రం ప్రతిపాదించిన రూ.20వేల కోట్లకు ఎలా అంగీకరించారు? చంద్రబాబు ప్రభుత్వం నాడు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఈ రోజు కేంద్రం దానిని ముందుకు తెచ్చింది.  
► పోలవరంపై కేంద్రం ప్రకటించిన అంచనా వ్యయాలను మా ప్రభుత్వం అంగీకరించదు.  సీఎం జగన్‌  ప్రధానికి లేఖ రాయబోతున్నారు. ప్రధానిని కలిసి అన్ని వివరాలను అందిస్తారు. 
► చంద్రబాబు మాదిరిగా రాష్ట్రాన్ని అడ్డంగా ముంచి, ప్రజలను వెన్నుపోటు పొడిచే పనులు మేం చేయలేం. చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన వారే ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.   

>
మరిన్ని వార్తలు