పవన్‌కు దమ్ముంటే ఎన్నికల్లో గెలవాలి

25 Jan, 2021 04:11 IST|Sakshi

జనసేన శవరాజకీయాలు చేస్తోంది: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు

సాక్షి, అమరావతి:  జనసేన పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా సింగరపల్లి గ్రామంలో జనసేన కార్యకర్త ఆత్మహత్యకు తానే కారణమంటూ పవన్‌ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ‘జనసేన కార్యకర్త వెంగయ్య వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. నా వల్లే, నా కార్యకర్తల వేధింపుల వల్లే అతను మరణించినట్టు జనసేన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగరపల్లి వెళ్తే నాపై దౌర్జన్యానికి ఉసిగొల్పారు.

తపంచాలు, నాటు బాంబులతో తిరిగిన వ్యక్తితో నా కార్యకర్తలకేం సంబంధం? ఈ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్‌ కూడా మా నియోజకవర్గానికి వచ్చి నాపై ఆరోపణలు చేశారు. భారీ మెజారిటీతో గెలిచిన నేను.. రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి గెలవగలను. దమ్ము, ధైర్యం ఉంటే పవన్‌ ప్రజాతీర్పు కోరగలరా? ఆయన గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఓడిపోతే పవన్‌ పార్టీ మూసేసుకుని వెళ్లిపోతారా?’ అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు