ఉద్దవ్‌ థాక్రే నెత్తిన పిడుగు.. అల్టిమేటం జారీ చేసిన ఎంపీలు!

11 Jul, 2022 19:04 IST|Sakshi

ముంబై: శివ సేన ఎంపీలు తమ పార్టీ అధినేత ఉద్దవ్‌ థాక్రేకు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. బీజేపీ-ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ప్రకటించాలంటూ శివ సేన లోక్‌సభ ఎంపీలు ముక్తకంఠంతో పార్టీ అధిష్టానాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

ఈ మేరకు ముంబైలో ఇవాళ(సోమవారం) జరిగిన కీలక సమావేశంలో వాళ్లు పార్టీ వ్యతిరేక గళం వినిపించినట్లు సమాచారం. భేటీ అనంతరం సేన ఎంపీ గజానన్ కిరీట్కర్ మాట్లాడుతూ.. ముర్ము గిరిజన మహిళ అయినందున ఆమెనే బలపర్చాలని, ఓటేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే వాళ్ల నిర్ణయానికి అధిష్టానం ఎలా స్పందించిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. శివ సేనకు 18 మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా.. మీటింగ్‌కు పదమూడు మంది హాజరైనట్లు తెలుస్తోంది.

మరో ముగ్గురు ఎంపీలు సంజయ్‌ జాదవ్‌, సంజయ్‌ మాండలిక్‌, హేమంత్‌ పాటిల్‌కు భేటీకి హాజరుకాకపోయినా.. ద్రౌపది ముర్ముకే మద్ధతు ప్రకటిస్తామని తెలిపినట్లు గజానన్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. శివసేనకు మహారాష్ట్ర నుంచి 18 మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతాల తరపున ఎంపీ కాలాబెన్‌ డేల్కర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీలలో ఇద్దరు రెబల్స్‌ ఉండగా.. భావనా గవాలి, శ్రీకాంత్‌ షిండే(సీఎం ఏక్‌నాథ్‌ షిండే తనయుడు) భేటీకి దూరంగా ఉన్నారు. 

భేటీ జరిగింది, కానీ..
అయితే శివ సేన ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తున్న విషయంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ మరోలా స్పందించారు. మాతోశ్రీలో లోక్‌సభ ఎంపీల భేటీ జరిగిందని, 15 మంది హాజరయ్యారని చెప్తున్నారు. అయితే భేటీలో ఏం చర్చించారనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో భేటీలు ఉద్దవ్‌ థాక్రేకు అల్టిమేటం జారీ చేశారని, కుదరకపోతే.. ఎంపీలు సైతం షిండే గూటికి తరలిపోయే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. 

చదవండి: ఉద్దవ్‌ థాక్రేకు కొత్త తలనొప్పి.. ఎంపీల జంప్‌?

మరిన్ని వార్తలు