ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ఒక వరం: సీఎం జగన్

2 Dec, 2020 16:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న(1995-2004) సమయంలో పోలవరం గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ఎగువున ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టుల ఎత్తును పెంచుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. శాసనసభ శీతాకాల సమావేశల్లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. 2004లో దివంగత నేత వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాతే పోలవరం కుడి ప్రధాన కాల్వకు 10,327 ఎకరాలకు భూసేకరణ చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ హయాంలో 86 శాతం కుటి ప్రధాన కాల్వ పనులు జరిగితే.. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు మాత్రమే జరిగాయని సభలో పేర్కొన్నారు.
(చదవండి : లాభాల్లో బోనస్‌ మహిళలకే: సీఎం జగన్‌)

ఎడమ ప్రధాన కాల్వకు కేవలం 0.89 శాతం భూసేకరణ జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అనుమతులన్నీ వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయని తెలిపారు. వైఎస్సార్‌ హయాంలో కుడి కాల్వ పూర్తికాకపోతే పట్టిసీమ ప్రాజెక్టు ఎలా వచ్చిందని సీఎం జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కేవలం 20 శాతం పనులు మాత్రమే జరిగాయాన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అన్నారని గుర్తిచేశారు. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్ చేస్తే రూ.1343 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని సభలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రభస మూడో రోజు కూడా కొనసాగింది. సీఎం జగన్‌ ప్రసంగానికి అడ్డుపడుతూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పోలవరం గురించి మాట్లాడితే ఎక్కడ నిజాలు భయటపడతాయోననే భయంతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తొమ్మిది మంది టీడీపీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, రవికుమార్, బాలవీరాంజనేయులు, జోగేశ్వరరావు,రామకృష్ణబాబు, అశోక్, అనగాని సత్యప్రసాద్, వై.సాంబశివరావు ఉన్నారు. 

మరిన్ని వార్తలు