ఫేక్‌ బాబుపై చర్యలు తీసుకోవాల్సిందే

18 Aug, 2022 17:01 IST|Sakshi

మాజీ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: రాజకీయాల కోసం వ్యవస్థలను దిగజార్చే చంద్రబాబు చివరకు అశ్లీలాన్ని కూడా ఫేక్‌ వీడియోల ద్వారా వాడుకోవడమే కాకుండా తన దిగజారుడు రాజకీయాల కోసం అమెరికా సంస్థలను కూడా అడ్డగోలుగా వాడుకుంటూ దొరికిపోయారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. ఒక వెనుకబడిన వర్గానికి చెందిన ఎంపీ పేరు మీద అశ్లీల వీడియోను సృష్టించి, దాన్ని ఎల్లో మీడియా ద్వారా ప్రసారం చేసి.. దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. తప్పుడు వీడియోలు సృష్టించి, వాటిని ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేశ్‌తో పాటు ఎల్లో మీడియాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడుకు దేవుడు సిగ్గు అన్నది ఇవ్వడం మర్చిపోయినట్లున్నారని, అందుకే సిగ్గు, శరం ఏమాత్రం లేకుండా రాజకీయాల కోసం ఏదిపడితే అది మాట్లాడించడం, ప్రచారం చేయడం అలవాటుగా మారిందన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేర్ని నానిఇంకా ఏమన్నారంటే.. 
చదవండి: టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు 

పోతిని ప్రసాద్‌ ఎవరు? 
టీడీపీకి చెందిన నిఖార్సైన ఒకావిడ మాట్లాడుతూ.. ఈ సర్టిఫికెట్‌ కూడా కమ్మోళ్లు ఇచ్చారా అంటూ ఎకసెక్కాలు ఆడింది. మరి, ఈ సర్టిఫికెట్‌ ఇచ్చింది కమ్మోళ్లే కదా! పోతిని ప్రసాద్‌ కమ్మే కదా? ఇతను ఎవరు? ఆయన ఎవరికి సోదరుడు, ఆయనకు ఏం పని? మీకంత దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడే ఎక్లిప్స్‌ సంస్థకు లేఖ రాయొచ్చు కదా? దొంగలతో ఈ పనులు చేయించడం ఎందుకు? ఇంతకూ పోతిని ప్రసాద్‌ ఎవరో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
‘పోతిని ప్రసాద్‌ అనే వ్యక్తి సో అండ్‌ సో ఐడీతో నాకు ఒక వీడియో పంపించాడు. వీడియోలో ఉన్నది మరో ఫోన్‌కాల్‌తో రికార్డు చేసిన వీడియో. అది ఒరిజినలా? కాదా? అని అడిగారు. ఒక ఫోన్‌లో ఉన్న వీడియోను మరో ఫోన్‌ ద్వారా రికార్డు చేసిన వీడియో ఒరిజినల్‌ అని చెప్పాను. ఆ రిపోర్టును మార్చి ఇవ్వాలని అడిగాడు. నేను ఆలోచించుకునేలోపే దానిని మార్చి బయటకు వైరల్‌ చేశారు. నేను ఇచ్చినట్టు ప్రచారం అవుతున్న సర్టిఫికెట్‌ ఒరిజినల్‌ కాదు. అది ఎడిట్‌ చేసిన దొంగ సర్టిఫికెట్‌’ అని’ ప్రొఫెసర్‌ జిమ్‌ స్టాఫర్డ్‌ స్పష్టంగా మెయిల్‌ చేశారు. దీనిపై టీడీపీ స్పందన ఏంటి?  

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. 
ఫేక్‌ వీడియోను తయారు చేసినందుకు టీడీపీని, పోస్ట్‌ చేయించినందుకు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లను, నిజ నిర్ధారణ చేయకుండా అశ్లీల వీడియోను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేసినందుకు, పదేపదే ఈ అశ్లీలాన్ని చూడలేక ప్రజలు అల్లాడిపోయే వరకు ప్రసారం చేసిన టీడీపీ అనుకూల టీవీ చానళ్లను, ఆ చానళ్ల యాజమాన్యాలను, దొంగ వీడియాలు చూపించి ఫేక్‌ రిపోర్టులు చూపిస్తూ ప్రెస్‌మీట్‌ పెట్టిన టీడీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుతోంది. 

ఆ రిపోర్టు తాము ఇవ్వలేదని, అది అబద్ధమని అమెరికా సంస్థే చెబుతున్నప్పుడు టీడీపీ, ఎల్లో మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ తరఫున ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం.  
టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పట్టాభి, అనిత... వీరంతా కుట్ర పూరితంగా అమెరికా సంస్థను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం వాస్తవమా? కాదా? నివేదికను ట్యాంపర్‌ చేయించడం చంద్రబాబు చేసిన నేరం కాదా?  

పవన్‌.. పాచిపోయిన లడ్డూ రుచి చూపించావా?  
పవన్‌ కల్యాణ్‌ మాటకు నిబద్ధత లేదు. పూటకో మాట, రోజుకో వేషం. పవన్‌ కల్యాణ్‌ వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరింది?  
ఎన్నికల ముందు మోదీని తిట్టావు. మళ్లీ మోదీ చంకనెక్కావు. ఏ రాజకీయ అవసరం కోసం? మోదీకి ఏమైనా పాచిపోయిన లడ్డూ రుచి చూపించావా? మళ్లీ కొత్తగా లడ్డూ వండించావా? ఆ రోజు 11 రోజులు అన్నం తినలేదన్నావు కదా? మరచిపోయావా? 
పవన్‌ లాంటి విద్యార్థి.. స్కూల్‌లో ఏ వ్యాసం రాయమన్నా.. ఆవు కథ రాసినట్లు.. అధికారంలో ఉన్నా జగన్‌నే.. లేకపోయినా జగన్‌నే తిట్టడం ఎవరి కోసం?   

మరిన్ని వార్తలు