Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు

27 May, 2022 18:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మహానాడులో చంద్రబాబు నాయుడు‌ మేకపోతు గాంభీర్యం చూపుతున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, టీడీపీకి పట్టిన శనిగ్రహం చంద్రబాబేనని మండిపడ్డారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు అనుకుంటున్నారని, ఎన్టీఆర్ పేరు చెబితే ఇప్పటికీ చంద్రబాబుకు తడిచిపోతుందని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఏ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదని విమర్శించారు. 2018లోనే జనం 23 సీట్లకు పరిమితం చేసి వెళ్లగొట్టారని, ఐనా సరే ఇంకా రాజకీయాలలో తిరుగుతున్నాడని విమర్శించారు. 

‘ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాని వ్యక్తి చంద్రబాబు. అమలాపురంలో తన మనుషులతోపాటు తనతో తిరిగే నిక్కర్ల బ్యాచ్‌తో ఇళ్లు తగులపెట్టించారు. మహానాడులో అడ్రస్ లేని వాళ్లని కూర్చోపెట్టుకున్నారు. సీఎం జగన్ గట్టిగా చూస్తేనే పరారయ్యే వారిని పక్కన కూర్చోపెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు. సీఎం జగన్‌ తాను చెప్పిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక శాతం పదవులు ఇచ్చారు. వారందరినీ రాజకీయంగా, సామాజికంగా పైకి తెస్తున్నారు.

రాష్ట్రంలో 50% బడుగులకు న్యాయం చేస్తుంటే జగన్‌ను ఎందుకు ఓడించాలి? బడుగులను వదిలేసి రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు ప్రాధాన్యత ఇవ్వాలా? బస్సు యాత్ర మీద కూడా చంద్రబాబు విషం కక్కుతున్నారు. ఈ 420 మాట్లాడే మాటలను ఎవరూ విశ్వసించరు. కోట్లు ఖర్చు చేస్తూ చేసుకునే మహానాడుకి, బస్సుయాత్రకు సంబంధం ఏంటి? నీ కొడుకుని కూడా గెలిపించుకోలేని దద్దమ్మవి. ఎన్టీఆర్ వందో పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబును రాష్ట్రం దాటి వెళ్లేలా తరిమి కొట్టాలి.
చదవండి: ‘టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు’

మరిన్ని వార్తలు