ఈజ్‌ ఆఫ్‌ సెల్లింగ్‌లో బీజేపీ టాప్‌

2 Jul, 2022 07:55 IST|Sakshi

ఈవోడీబీ ర్యాంకు ఇచ్చింది మీరే.. విమర్శించేది మీరే

పారిశ్రామిక రంగంలో కీలక మార్పులు తెస్తున్న సీఎం జగన్‌పై విమర్శలా?

బాబు సీఎంగా ఉన్నప్పుడు 60 పరిశ్రమలను అమ్మించారు

స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఎందుకుపెదవి విప్పరు?

బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై మంత్రి అమర్‌నాథ్‌ ధ్వజం

సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈవోడీబీ)లో ఏపీని మొదటి స్థానంలో నిలిపితే.. దేశంలోనే ప్రముఖ కర్మాగారాలను అమ్మకానికి పెడుతూ ఈజ్‌ ఆఫ్‌ సెల్లింగ్‌లో బీజేపీ నంబర్‌వన్‌గా ఉందని రాష్ట్ర పరి శ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ టాప్‌ ర్యాంక్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడు తూ పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు సేకరించి ఈ ర్యాంకులని ప్రకటిస్తే.. దాన్నికూడా తప్పుపట్టి జీవీఎల్‌ సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నారన్నారు.

ర్యాంకు ఇచ్చిందీ మీరే, విమర్శించేదీ మీరే అని అన్నారు. పారిశ్రామికరంగంలో కీలక మార్పులు తీసుకొస్తు న్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలి పెడుతున్నామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 60 పరిశ్రమలను అమ్మించింది మీరు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రా నికి వేలకోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్న సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు.  స్టీల్‌ప్లాంట్‌ను మీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుంటే ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. 2019 తరువాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిందని, బీజేపీకీ ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 175 స్థానాల్లో పోటీచేసీ మళ్లీ డిపాజిట్లు పోగొట్టుకోవాలన్న సరదా ఉంటే అందుకు సిద్ధం కావాలని అన్నారు.

మరిన్ని వార్తలు