సాక్షి, తాడేపల్లి: ఓటేసిన ప్రజలకు తన హయాంలో చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పథకమైనా అందించారా?.. అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఆనాడు ఏం చేయకుండా.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం జగన్ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారాయన. బుధవారం సాయంత్రం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు తన పార్టీ నేతలను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు తన హయాంలో ఇంత మెరుగైన పాలన అందించారా? ఓటేసిన ప్రజలకు ఒక్క మంచి పథకమైనా అమలు చేశారా?. చంద్రబాబును ప్రజలు వద్దనుకున్నారు కాబట్టే తరిమికొట్టారని మంత్రి అమర్నాథ్ అభిప్రాయపడ్డారు.
తన పేరు చెబితే ప్రజలు ఓట్లే వేయరనే ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాడు చంద్రబాబు. ఉత్తరాంధ్రకు మంచి చేద్దాం అనుకుంటున్న ఈ ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిపక్షం అడుగడుగునా అడ్డుపడుతోంది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. సుమారు 32 లక్షల మంది సొంతింటి కలను నెరవేరుస్తున్నాం అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.