బూతులను సమర్థిస్తూ దీక్షా?

22 Oct, 2021 04:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: చెరువును కబ్జా చేసి ప్రభుత్వ స్థలంలో అవినీతి సొమ్ముతో నిర్మిం చిన పార్టీ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకోసం దీక్ష చేస్తున్నారో చెప్పాలని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) నిలదీశారు. పట్టాభి బూతు వ్యాఖ్యలను సమర్థిస్తూ దీక్ష చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కాటికి కాళ్లు చాపిన వయసులో లోకేష్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టాలనే భ్రాంతితో విద్వే షాలను రెచ్చగొడతారా? అని మండిపడ్డారు. 74 ఏళ్ల వయసులో అత్యంత ఏహ్యమైన, నీతిమాలిన రాజకీయాలు చేయడం అవ సరమా? ఒక్కసారి అంతరాత్మను ప్రశ్నించు కోవాలంటూ చీవాట్లు పెట్టారు. కొంగ జపాలు చాలించి పట్టాభి దుర్భాషలపై సీఎం జగన్‌కు క్షమాపణ చెప్పి నిమ్మరసం తీ సుకుని దీక్ష విరమిం చాలని హితవు పలికారు. తాడేప ల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఏమిటీ శునకానందం?
సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలతో జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. పట్టాభితో పక్కా ప్రణాళికతో సీఎం జగన్‌ను, ఆయన మాతృమూర్తిని సభ్య సమాజం తలదించుకునే రీతిలో దూషించడంతో కడుపుమండిన అభిమానులు ప్రతిస్పందించారు. పట్టాభి వ్యాఖ్యలను ఖండించాల్సిన చంద్రబాబు వాటిని సమర్థిస్తూ దీక్షకు దిగడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఓ కబ్జాకోరును పక్కన కూర్చోబెట్టుకుని పట్టాభి వ్యాఖ్యలను మరోసారి చెప్పించి శునకానందం పొందడం ఏమిటి? చంద్రబాబు రాజకీయ చరిత్రను చూస్తే కుట్రలు, కుతంత్రాలు, మనుషులను కొనుగోలు చేయడం, పచ్చి అబద్ధాలు, నయవంచన, అధికారం కోసం ఏ నీచానికైనా ఒడిగట్టడం కనిపిస్తుంది. పట్టాభి వ్యాఖ్యలను సమర్థిస్థారా? అని మీ కుటుంబంలో మహిళలనే అడగండి. వాటికి అర్థం  అమాయకుడు అని పయ్యావుల కేశవ్‌ చెబుతున్నారు. టీడీపీలో నీకంటే అమాయకుడు ఎవరూ ఉండరని అంటే ఊరుకుంటావా?. టీడీపీ కార్యాలయంలో ఇంత నీచమైన భాష మాట్లాడతారా?

టీడీపీలో మిగిలింది దయ్యాలే..
ప్రజలే దేవుళ్లు.. పార్టీయే దేవాలయం అని నాడు ఎన్టీఆర్‌ చెప్పారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని చంద్రబాబు లాక్కున్నప్పుడే అది దయ్యాల కొంపగా మారింది. ఆ పార్టీలో మిగిలింది దయ్యాలే. ఎన్టీఆర్‌ శాపాలు, లోకేశ్‌ ప్రవర్తనే ఆ పార్టీకి తాళం పడేలా చేస్తాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది కాబట్టే చంద్రబాబు, లోకేశ్‌ ఇష్టారాజ్యంగా ఆగడాలు సాగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా తిరుపతిలో అమిత్‌ షాపై రాళ్ల దాడి జరిగితే రాష్ట్రపతి పాలన విధించాలని ఎందుకు అడగలేదు? చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి అదే అమిత్‌ షాకు ఏమని ఫిర్యాదు చేస్తారు? ఆయన మీకు తగిన బుద్ధి చెప్పి పంపించడం ఖాయం. అధికారం దూరమైందనే అక్కసుతో ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుగా లేదా? గంజాయి స్మగ్లింగ్‌ చంద్రబాబు పుణ్యమే. 2018 సెప్టెంబర్‌ 2న ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక రాసిన కథనమే అందుకు నిదర్శనం. చంద్రబాబు లాంటి డర్టీయస్ట్‌ పొలిటీషియన్‌ ప్రపంచంలోనే లేరన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు అక్షర సత్యం.  

చదవండి: జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సీఎం జగన్‌ సమీక్ష

మరిన్ని వార్తలు