దుర్బుద్ధితోనే ఎన్నికల కోడ్ తెచ్చే ప్రయత్నం..

9 Jan, 2021 15:28 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి నారాయణ స్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 'చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్‌ తొత్తులా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయడం ఏకపక్ష నిర్ణయం. చంద్రబాబు ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ దశలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గం. ఇప్పట్లో ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ప్రభుత్వ ఉపాధ్యాయులే అంటున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్‌ ఎన్నికలకు సిద్ధపడటం దారుణం. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం' అని మంత్రులు తెలిపారు.

 

గుంటూరు: కొంత మంది దుర్బుద్ధితో ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం చేయాలని చూస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సర, సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలను ఇచ్చారు. ఎవరూ ఇళ్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు ఆయన తాబేదార్లు కుతంత్రంతో కోర్టులకు వెళ్ళారు. మరికొంతమంది దుర్బుద్ధితో పట్టాల పంపిణీ ఆలయస్యం చేయాలని ఎన్నికల కోడ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: ('పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడు')

ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందకుండా అడ్డుకోవాలని టీడీపీ, ఇతర వ్యక్తులు చేస్తున్న కార్యక్యమాలపై ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్నికలు అందరికీ అవసరమే. కాదనడం లేదు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆలోచన చేయాలి. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఇచ్చిన మాటను నెరవేర్చడమే ముఖ్యమంత్రి ధ్యేయం. విగ్రహాలను ధ్వంసం చేస్తూ ముఖ్యమంత్రిపై ఏలెత్తి చూపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారు. నీచమైన ఆలోచనలతో రాజకీయాలు చేస్తున్నారు. దేవుడు అన్నీ చూసుకుంటాడనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్‌)

మరిన్ని వార్తలు