‘ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదు’

18 Aug, 2021 15:34 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసు విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సునీల్‌ కుమార్‌ తెలిపారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. అయితే నారా లోకేష్‌బాబు, ఆ పార్టీ నేతలు రాజకీయ ఉనికి కోసం ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్న చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని మండిపడ్డారు. అప్పుడు లేవని ఆ పార్టీలోని దళిత నాయకుల నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. ఆ నాడు చంద్రబాబు సహా టీడీపీ నేతలు దళితుల గురించి మాట్లాడిన మాటలు గుర్తులేవా అని, అప్పుడు ఈ దళితుల నోళ్లు ఎందుకు లేవలేదని విమర్శించారు. చంద్రబాబు మెప్పు కోసం పని చేయవద్దని టీడీపీ నాయకులకు సునీల్‌ కుమార్‌ హితవు పలికారు. 

దళితులకు అండగా ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదని భరోసానిచ్చారు. టీడీపీ హయాంలో దళితుల్లో కేవలం ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే వైఎస్‌ జగన్‌ 5 మందికి పైగా మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని దళితులంతా జగనన్న వెంటే ఉన్నారని, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా మమ్మల్ని జగనన్నతో విడదీయలేరని స్పష్టం చేశారు. 
చదవండి: రమ్య హత్యకు ముందు రెక్కీ
పాక్‌లో దారుణం: మహిళా టిక్‌టాకర్‌పై 300 మంది దాడి!

మరిన్ని వార్తలు