ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనలేరు.. అందుకే విశ్వాస తీర్మానం: సీఎం కేజ్రీవాల్‌

29 Aug, 2022 14:11 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం ఢిల్లీ అసెంబ్లీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే సీఎం కేజ్రీవాల్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.  

ఆపరేషన్‌ లోటస్, లిక్కర్‌ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. అయితే ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఆప్‌ విశ్వాస తీర్మానం పెట్టిందని సభలో బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సభ్యలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు. 
చదవండి: రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో ఆజాద్‌.. అందుకే కాంగ్రెస్‌ను వీడానంటూ..

విశ్వాస తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేలు విషయాలు చర్చకు రాకుండా.. రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే సభకు వస్తున్నారని ఆరోపించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరితో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఆఫర్‌ చేసిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. 

ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్‌​ కమలం విఫలమైందని రుజువు చేసేందుకే సభలో విశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని.. ఢిల్లీలోని అలాంటి ప్రయత్రాలు చేసిందని విమర్శించారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 

మరిన్ని వార్తలు