Asaduddin Owaisi Satires on BJP: ‘తాజ్‌మహల్‌ కట్టకపోతే లీటర్‌ పెట్రోల్‌ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు

5 Jul, 2022 12:26 IST|Sakshi

భోపాల్‌: ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 

'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.104-115కి చేరడానికి తాజ్‍మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్‍ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్‌మహల్‌, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్‌ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.
చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు?

భారత్‌ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్‌ను చూస్తుందని ధ్వజమెత్తారు.

మొగలులు, పాకిస్థాన్‌తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు.
చదవండి👉🏻వ్యాక్సినేషన్‌ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు

మరిన్ని వార్తలు