ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి.. కిషన్‌ రెడ్డిని నిలదీయాలి

3 Oct, 2022 08:17 IST|Sakshi

మణికొండ: బసవ లింగాయత్‌లను రాష్ట్ర ప్రభుత్వం బీసీలలో కలిపినా ఓబీసీలో కలిపేందుకు కేంద్రం తాత్సారం చేస్తుందని, ఆ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీయాలని మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌ నగర శివారు కోకాపేటలో ఎకరం భూమిలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన బసవభవన్‌కు మంత్రులు పి.సబితారెడ్డి, మహామూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్, జహిరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌లతో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బసవేశ్వరుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేశామని, ఆయన జయంతిని అధికారికంగా జరుపుతున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెడుతున్నామని వెల్లడించారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చామన్నారు. సమాజంలో ఎలాంటి కులాలు లేవని, అందరం సమానమేనని, మహిళలకు అన్ని హక్కుల కల్పించాలని పోరాడిన వ్యక్తి బసవేశ్వరుడని స్పీకర్‌ పోచారం పేర్కొన్నారు. అప్పట్లోనే కులాంతర వివాహం చేయించి బసవేశ్వరుడి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలోఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మహామూద్‌అలీ, పి.సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు, ఎమ్మెల్యేలు పి.నరేందర్‌రెడ్డి, హన్మంత్‌ షిండే, క్రాంతికుమార్, భూపాల్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ఎం.శివకుమార్, టీడీసీ చైర్మన్‌ ఉమాకాంత పాటిల్, బసవ సమన్వయ కమిటీ ప్రతినిధులు, లింగాయత్‌ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.
చదవండి: తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

మరిన్ని వార్తలు