అసోం పోల్స్‌: అఖిల్‌ గొగోయ్‌ సంచలన ఆరోపణలు

24 Mar, 2021 08:30 IST|Sakshi

కస్టడీలో టార్చర్‌ చేశారు అఖిల్‌ గొగోయ్‌ ఆరోపణ 

ఎన్‌ఐఏ 20 కోట్ల ఆఫర్ ఇచ్చింది : అఖిల్ గోగోయ్ 

బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరమని కూడా కోరింది

చౌకబారు రాజకీయాలు : బీజేపీ

సాక్షి,గౌహతి: జైల్లో తనను మానసికంగా, శారీరకంగా హింసించారని యాంటీ సీఏఏ యాక్టివిస్టు అఖిల్‌ గొగోయ్‌ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బీజేపీలో చేరితే తనకు వెంటనే బెయిల్‌ ఇస్తామని ఎన్‌ఐఏ ఆశచూపిందంటూ అఖిల్‌ లేఖ రాశారని ఆయనకు చెందిన రైజోర్‌ దళ్‌ వెల్లడించింది. కోర్టు అనుమతిలేకుండా అఖిల్‌ను 2019 డిసెంబర్‌లో ఢిల్లీకి తీసుకుపోయారని తెలిపింది. అక్కడ ఎన్‌ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో తనను బంధించారని, గాఢమైన చలిలో నేలపై పడుకోవాల్సివచ్చిందని అఖిల్‌ లేఖలో తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరితే బెయిల్‌ పొందవచ్చన్న ఆఫర్‌ను తిరస్కరించగా కావాలంటే అసెంబ్లీకి పోటీ చేసి మంత్రికావచ్చని ఆశ చూపారన్నారు.

అంతేకాకుండా కేఎంఎస్‌ఎస్‌(కృషిక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి)ని వీడి ఒక ఎన్‌జీఓ ఆరంభించి, అసోంలో క్రిస్టియన్‌ మతమార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారన్నారు. ఇవేవీ తాను అంగీకరించకపోవడంతో అసోం సీఎం మరియు ఒక ప్రభావవంతమైన మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని, దీన్ని కూడా తాను వ్యతిరేకించానని తెలిపారు. దీంతో తనపై ఎన్‌ఐఏ తీవ్రమైన ఆరోపణలతో కూడిన కేసులు పెట్టిందన్నారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయని, పదేళ్లు జైలు జీవితం గడపాలని భయపెట్టారని తెలిపారు. కోవిడ్‌ కారణంగా అఖిల్‌ను గౌహతి మెడికల్‌ కాలేజీలో చేర్చారు. యాంటీ సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అఖిల్‌ను ఎన్‌ఐఏ 2019లో అరెస్టు చేసింది. 

అయితే అఖిల్‌ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఇవన్నీ చౌకబారు రాజకీయాలని బీజేపీ ప్రతినిధి రూపమ్‌ గోస్వామి ఆరోపించారు. అసోం ఎన్నికలకు ముందు ఈ లేఖ విడుదల కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అఖిల్‌కు ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. కాగా రేజర్ పార్టీ అసెంబ్లీ జనతా పరిషత్ (ఏజేపీ) తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి పోటీ చేస్తున్న గొగోయ్ శివసాగర్ సీటు నుండి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు