పెట్రోలుపై రూ. 5 తగ్గించిన బీజేపీ సర్కార్‌ 

12 Feb, 2021 13:32 IST|Sakshi

గువహటి : పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశాన్నంటుతున్న తరుణంలో అసోం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ అ‍క్కడి బీజీపే సర్కారు వాహన దారులకు భారీ ఊరట నిచ్చింది. అలాగే మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు అసోం ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. (Petrol Diesel Prices : వాహనదారులకు చుక్కలే!)

సవరించిన ఈ రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసెంబ్లీలో ప్రకటించారు. కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌, మద్యంపై అదనపు సెస్ విధించాం..కానీ ఇప్పుడు, రోగుల సంఖ్య  బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో తాజా రేటు కోతను ప్రకటించామన్నారు. దీంతో పెట్రోలుపై లీటరుకు 5 రూపాయల భారం తగ్గుతుందని, తద్వారా లక్షలాది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు కొత్త గరిష్టాలను తాకిన సమయంలో  ఈ తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌లో జరగనున్నాయి, ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారీ కసరత్తు చేస్తోంది. 

మరిన్ని వార్తలు