Sri Sathyasai District: కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్‌.. ప్రాణాపాయస్థితిలో..

11 Jun, 2022 08:53 IST|Sakshi

చాంద్‌ వర్గీయుడిపై కందికుంట వర్గీయుల దాడి

కదిరి టౌన్‌: నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చాంద్‌ వర్గీయుడు శ్రీనివాసులు నాయుడిపై కందికుంట వర్గీయులు దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. శ్రీనివాసులు నాయుడు ఈసారి తమ నేత చాంద్‌బాషాకే టికెట్‌ వస్తుందని సోషల్‌ మీడియాలో శుక్రవారం సాయంత్రం పోస్టు చేశాడు. దీన్ని కందికుంట వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకుని ఇంటి వద్దకు వెళ్లారు.

దాడిలో గాయపడిన శ్రీనివాసులు నాయుడు

అక్కడ లేకపోవడంతో పట్టణంలో గాలిస్తుండగా.. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని చాంద్‌ లాడ్జీ వద్ద ఆటోలో తారసపడ్డాడు. దీంతో అతనిపై కందికుంట వర్గీయులైన టీడీపీ పట్టణాధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్, సయ్యద్, ఇమ్రాన్, సోను ఫయాజ్, బాబు, మారుతి, రామాంజనేయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చాంద్‌ వర్గీయులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్‌ సీఐ రియాజ్‌ అహమ్మద్‌ తెలిపారు.  

చదవండి: (అక్రమాలు.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్‌ ఇండస్ట్రీపై కేసు..)

మరిన్ని వార్తలు