‘మంత్రులకు పవన్‌ క్షమాపణ చెప్పాలి’

29 Dec, 2020 14:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్‌ చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు పవన్ జాగ్రత్తగా మాట్లాడాలి. మంత్రుల పట్ల సంస్కారం లేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆరు నెలలకు ఒకసారి పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తున్నారు. రైతులపై పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. నెల రోజుల వ్యవవదిలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివర్ తుపాన్ పంట నష్ట పరిహారం అందించారు. టీడీపీ హయాంలో తుపాన్ పంట నష్ట పరిహారం రావాలంటే రెండేళ్లు పట్టేది’  అన్నారు. 

‘చంద్రబాబు సొంత పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరు రైతులపై కపట ప్రేమ కురిపిస్తున్నారు. సినిమా షూటింగ్ లేదు కాబట్టి పవన్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. లోకేష్ టైం పాస్‌కు వచ్చినట్లు రాష్ట్రానికి వస్తున్నారు. వకీల్ సబ్ సినిమా ప్రమోషన్ కోసం పవన్ రాష్ట్రానికి వచ్చినట్లు ఉంది’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. (చదవండి: ‘జూమ్‌లో చంద్రబాబు.. ట్విట్టర్‌లో లోకేష్‌’ )

సీఎం జగన్‌ పేదవాడి సొంతింటి కల నేరవేర్చారు: జోగి రమేష్‌
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాగూడూరు మండలం తరకటూరులో 92 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చిన వ్వక్తి సీఎం జగన్. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్ని ఇళ్ల స్థలాల పట్టాలు పంచిపెట్టాడు. సినిమా డైలాగులు చెప్పడం కాదు వ్యవసాయం అంటే ఏంటో తెలియని లోకేష్‌ పంట నష్టపరిహారం గురించి మాట్లాడుతున్నాడు. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయి అన్నట్లుగా ఉంది లోకేష్, పవన్‌ల పర్యటన. నివర్ తుపాను వల్ల పంట నష్టపోయి 33 రోజులు  అయ్యింది. పంట నష్టపోయిన ప్రతి రైతు ఎకౌంట్లో నష్ట పరిహారం నగదును సీఎం వైఎస్ జగన్ జమ చేస్తున్నారు. నిన్న పెడన నియోజకవర్గంలో ఒక పక్క సినిమా యాక్టర్ మరో పక్క పప్పు లోకేష్ పర్యటించి కామిడీ చేశారు’ అన్నారు. 

మరిన్ని వార్తలు