ఊహించని షాక్‌: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం

2 May, 2021 19:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య రాష్ట్రం అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మినహా బీజేపీకి ఆశించిన ఫలితాలు పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడులో రాలేదు. ఈ మినీ సమరంపైన ఏడాదికాలంగా ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీకి ఈ ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడులో సత్తా చాటుతానని ప్రకటించిన బీజేపీ చేసిన ప్రకటనలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. కేరళలో ఉన్న ఒక్క స్థానం కూడా కోల్పోవడం ఆ పార్టీకి దక్షిణాన చోటు లేదని కేరళ ఓటర్లు నిరూపించారు.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా ఎన్నికలకు ముందుకు వెళ్లి బీజేపీ తీవ్ర విమర్శలపాలైంది. ఎన్నికలు వాయిదా వేయాలని స్థానిక కోర్టులతోపాటు సుప్రీంకోర్టు కూడా చెప్పినా వినిపించుకోలేదు. ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల మూలంగానే దేశంలో కరోనా కల్లోలం సృష్టించింది. దీనికి బాధ్యత వహించాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొండిగా ఎన్నికలు నిర్వహించారు.. ఫలితాలు వచ్చాయి. తత్ఫలితమే ఈ ఫలితాలు అని విశ్లేషకులు అని పేర్కొంటున్నారు.

పశ్చిమబెంగాల్‌లో వాస్తవంగా బీజేపీ బలం పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ దాదాపు 80 స్థానాలకు పెరగడం మామూలు విషయమేమి కాదు. కానీ బీజేపీ అధికారమే లక్ష్యంగా వెళ్లడంతో దానికి తగ్గట్టు ఫలితం రాలేదు. ఇక దక్షిణాన కీలక ప్రాంతాలైన తమిళనాడు, కేరళలలో బోణి కొట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. తమిళనాడులో పదిలోపు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇక కేరళలో ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేదు.

చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?'
చదవండి: గెలుపు సంబరం.. పొంచి ఉన్న కరోనా విస్ఫోటనం

>
మరిన్ని వార్తలు