ఉమ్మడి రాజధాని: పదేళ్ల హక్కు కేసీఆర్‌కు చంద్రబాబు తాకట్టు

15 May, 2021 15:26 IST|Sakshi

చంద్రబాబుపై బహుజన పరిరక్షణ సమితి నేతల ధ్వజం 

తాడికొండ: రాష్ట్ర విభజన అనంతరం 2024 వరకు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను వాడుకునే హక్కును కేసీఆర్‌కు తాకట్టు పెట్టి అర్ధరాత్రి ఆంధ్రా కరకట్టకు పారిపోయి వచ్చిన చంద్రబాబుకు సీఎం జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 227వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షల్లో పలువురు నాయకులు  ప్రసంగించారు. 

కరోనా రోగులను హైదరాబాద్‌ రాకుండా అడ్డుకుంటుంటే చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు అండ్‌ కో కేసీఆర్‌ను పల్లెత్తు మాట ప్రశ్నించకుండా.. ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా పారిపోయి వచ్చినందునే.. నేడు ఈ దుస్థితి దాపురించిందన్నారు. బాబుకు కొమ్ముకాస్తూ ఏపీ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలిన ఎంపీ రఘురామకృష్ణరాజు పాపం పండి జైలుకు వెళ్లాడని, ఇక చంద్రబాబు, నారా లోకేష్‌ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు