బాబు నోరు తెరిస్తే అబద్ధాలే..

16 Sep, 2021 03:28 IST|Sakshi

గత టీడీపీ ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు చెల్లించలేదు

ఇప్పుడు చెల్లించాల్సి రావడంతోనే ప్రజలపై తాత్కాలిక భారం

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 

ఒంగోలు అర్బన్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి ఐదుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచామని చంద్రబాబు అండ్‌ కో అనడం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలపై రూ.9 వేల కోట్లు భారం వేసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే చంద్రబాబుది నోరా లేక తాటిమట్టా అని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు అదనంగా ఖర్చయిన విద్యుత్‌కు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు గత టీడీపీ ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. దానిని చెల్లించాల్సి రావడంతో ఆ భారం కొంతమేర ప్రజలపై పడిందన్నారు. అంతేతప్ప తమ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, పెంచబోదని స్పష్టంచేశారు. ఈ భారం కూడా కేవలం 7, 8 నెలలే ఉంటుంన్నారు.  

బాబు రహస్యంగా మారిషస్‌ వెళ్లలేదా? 
ఎవరికీ తెలియకుండా రెండు నెలల క్రితం చంద్రబాబు ప్రత్యేక విమానంలో మారిషస్‌ వెళ్లలేదా అని ప్రశ్నించారు. తన రష్యా పర్యటన రహస్యమేమీ కాదని.. స్నేహితుని జన్మదినానికి ఆయనే ప్రత్యేక విమానం ఏర్పాటుచేస్తే మిత్రులంతా కలిసి వెళ్లామన్నారు. తాను క్యాసినోలకు వెళ్లానని విమర్శించే వారు రష్యా కమ్యూనిస్టు దేశమని,  అలాంటివి ఉండవని  తెలుసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు