నీ స్థాయేంటో తెలుసుకుని మాట్లాడు

29 Dec, 2020 11:57 IST|Sakshi

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

సాక్షి, కరీంనగర్‌: భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్‌ మీద ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద ఆయన చేస్తున్న ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్‌.. ఆయన స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నీ పదవి కూడా కేసీఆర్‌ భిక్షే అని విమర్శించారు. ప్రజలు నిన్ను కరీంనగర్‌ ఎంపీగా గెలిపిస్తే నీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశావని నిలదీశారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. స్మార్ట్‌ సిటీ నిధులను ఢిల్లీలోనే ఆపించే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్‌ను నిందించారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారని వ్యాఖ్యానించారు. మేమూ నీలాగా చిల్లరగా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. (చదవండి: కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే)

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కూడా బాల్క సుమన్‌ ఫైర్‌ అయ్యారు. పసుపు బోర్డు తెప్పిస్తానన్న ఎంపీ.. దాని గురించి తప్ప అన్నింటి మీదా మాట్లాడుతారని వ్యంగ్యాస్స్త్రాలు సంధించారు. ముందు నీ పార్లమెంట్‌ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి తర్వాత రాష్ట్ర రాజకీయాలు మాట్లాడమని హితవు పలికారు. ఇక బాండు పేపర్‌ మీద రాసిచ్చిన వాగ్ధానం ఏమైందని సూటిగా ప్రశ్నించారు. మా మీద విమర్శలు చేసే ముందు ఈ హామీలను ఏం చేశారో సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. (చదవండి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు హాస్యాస్పదం )

>
మరిన్ని వార్తలు