కేసీఆర్‌ ఫాంహౌజ్‌ను చెక్‌ చేయాలి: బండి సంజయ్‌

19 Dec, 2020 18:48 IST|Sakshi

హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదు

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం పార్టీ నేతలు తుపాకులతో నానాయాగీ చేస్తున్నా హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారులను అవమానించేలా టీఆర్‌ఎస్‌ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో తాము పనిచేయలేమని పోలీసులు బాహాటంగా చెబుతున్నారని పేర్కొన్నారు. కాగా ఆదిలాబాద్‌ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ రివాల్వర్‌తో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా పడ్డారు. (చదవండి: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత)

కేసీఆర్‌ ఫాంహౌజ్‌ను తనిఖీ చేయాలి
ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ శనివారం మాట్లాడుతూ.. ‘‘భైంసా లో హిందువుల ఇళ్లను దగ్ధం చేస్తే పట్టించుకోలేదు. ఎంఐఎం గుండాలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. నానాయాగీ చేస్తున్నారు. అయినా హోం మంత్రి స్పందించడం లేదు’’ అని విమర్శించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో కాళీమాత భూములను కబ్జా చేసేందుకు ఎంఐఎం కుట్ర చేస్తోంది. ఎండోమెంట్ స్థలాలను కాపాడాలని బీజేపీ నేతలు కోరితే.. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎవరి కోసం పని చేస్తున్నారు.ఫసల్ బీమా యోజన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. ఒకసారి సీఎం ఫాంహౌజ్‌ను తనిఖీ చేయాలి.

పదే పదే ఆయన అక్కడికి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలోని యూనివర్సిటీలను నిర్విర్యం చేస్తున్నారు. రెండేళ్లైనా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే.. 2023లో ప్రజలే మీకే పెన్షన్ ఇస్తారు’’ అని సీఎం కేసీఆర్‌ తీరును సంజయ్‌ ఎండగట్టారు. ఇక టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలకు బదులిస్తూ.. ‘‘ప్రధాని ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులు ఎక్కడికి పోయాయి.. బీజేపీ గాల్లో గెలించిందో.. టీఆర్‌ఎస్‌ గాల్లో కొట్టుకుపోతుందా.. అనేది అందరూ చూస్తున్నారు. కేసీఆర్‌ను జైల్లో పెట్టే రోజు త్వరలో వస్తుంది. ఆయన జైలుకు పోవడం ఖాయం. కేసీఆర్ లేని తెలంగాణ కావాలని ప్రజలు భావిస్తున్నారు.. అది బీజేపీ వల్లే సాధ్యం’’ అని పేర్కొన్నారు. కాగా కరీంనగర్ కార్పొరేషన్‌కు సంబంధించి టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ నేడు బీజేపీలో చేరుతున్నారు.

మరిన్ని వార్తలు