కేబినెట్‌ .. ఓ టైం పాస్‌ మీటింగ్‌ 

19 Jan, 2022 02:21 IST|Sakshi

బండి సంజయ్‌ ఎద్దేవా  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేబినెట్‌ భేటీ.. ఓ టైం పాస్‌ మీటింగ్‌గా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. గంటల తరబడి సమావేశం పేరుతో రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కరించేసినట్లు షోచేస్తున్నారని ధ్వజమెత్తారు. కోవిడ్‌పై సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందని, ఏనాడూ ఆయన కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోమని ప్రజలకు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ నిర్వహించిన భేటీకి కేసీఆర్‌ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు.

మంగళవారం సంజయ్‌ జూమ్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతూ 317 జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతుంటే.. కేబినెట్‌ సమావేశంలో ఆ ప్రస్తావన లేకపోవడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రికి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్య పట్టదా? అని ప్రశ్నించారు.  ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే టీచర్లు లేకుండా స్కూళ్లు ఎలా నడుపుతారని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు