సాక్షి, కరీంనగర్: తనను ఎన్నో అవమానాలకు గురిచేశారంటూ కరీంనగర్లో సభలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘నాకు గెలుపు ముఖ్యం కాదు.. గెలుపు కోసం పనిచేస్తా. నాకు ప్రజలే ముఖ్యం.. పదవులు కాదు. నాకు డిపాజిట్ రాదని హేళన చేశారు. కరీంనగర్ నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచా’’ అని అన్నారు.
కరీంనగర్ గడ్డపై గాండ్రిస్తే కొందరికి వణుకు పుట్టాలని, కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తా. బీజేపీ అధినాయకత్వం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కారణం కార్యకర్తలే. కరీంనగర్లో కొట్లాడినట్లే రాష్ట్రమంతా కొట్లాడమని మోదీ, అమిత్షా, నడ్డా చెప్పారు. తెలంగాణ కాషాయ జెండా రెపరెపలాడాలని చెప్పారు. ధర్మ కోసం యుద్ధం చేస్తా. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఏం చేశారో కేసీఆర్ చెప్పడం లేదు. మోదీని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు.
చదవండి: కేసీఆర్ సెంటిమెంట్పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. సంజయ్ సక్సెస్ అయ్యేనా?