తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బం‍డి సంజయ్‌

4 Aug, 2022 14:42 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని, మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని అన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీని, మోదీ పథకాలను చాలా సందర్భాల్లో ప్రశంసించారని ప్రస్తావించారు.

చికోటి వ్యవహారంలో కేసీఆర్‌ కుటుంబ పాత్ర ఉందని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజులో భాగంగా భువనగిరిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయిష్మాన్ భారత్‌లో జర్నలిస్టులను చేర్చే విషయంపై చర్చిస్తానని తెలిపారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత తమదేనన్నారు.

క్యాసినో స్కామ్‌లో చాలా మంది టీఆర్‌ఎస్‌ నాయకులున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. డగ్ర్‌ కుంభకోణంలో కూడా వారే ఉన్నారన్నారు. నయీమ్ డైరీ ఏమైందని, డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీమ్ వల్ల కేసీఆర్ కుటుంబానికి ఇబ్బంది రావడంతో అతన్ని ఎన్‌కౌంటర్‌ చేశారని అన్నారు. నయీమ్ బాధితులను ఆదుకొని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు రికవరీ చేస్తామన్నారు. ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని, మధ్యలో ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటినే తమ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. 
చదవండి: పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు