‘పల్లాను గెలిపిస్తే సీఎం గ్లాస్‌లో సోడా పోశాడు’

22 Feb, 2021 14:56 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : తెలంగాణలో రాక్షస పాలన, గడీల పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. జిల్లా కలెక్టరేట్‌ వద్ద బండి సంజయ్‌ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేధావి వర్గం బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. నీచ రాజకీయాలకు సమాధి కట్టాలన్నా.. టీఆర్‌ఎస్‌పార్టీ పార్టీ మెడలు వంచాలన్నా.. దమ్మున్న బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు. అమరవీరుల రక్తపు మడుగులో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌.. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యారన్నారు.

ఉపాధ్యాయులను మోసం చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, వారి కోసం జైలు కెళ్లిన బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పీఆర్సీ వస్తుందని పేర్కొన్నారు. ఉద్యమాల పురిటిగడ్డగా నిలిచిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలన్నారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీని గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ పారిపోయిందని, ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే నోటిఫికేషన్, పీఆర్సీ వస్తాయని అన్నారు. అదే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని గెలిపిస్తే సీఎం ఫామ్ హౌస్‌కు వెళ్లి గ్లాస్‌లో సోడా పోశారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోతుందని తెలిసి మరీ పల్లాకే మళ్ళీ టికెట్ ఇచ్చారని విమర్శించారు.
చదవండి: న్యాయవాదుల హత్య : సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు