రైతుల కోసం ఎందాకైనా వస్తా: బండి సంజయ్‌ 

16 Nov, 2021 04:18 IST|Sakshi

ఫామ్‌హౌజ్‌లో ఉంటే రైతుల బాధలు ఎలా తెలుస్తాయి?: బండి సంజయ్‌ 

ఆరు ముక్కలుగా నరికేస్తా అన్నావు.. ఎప్పుడో చెప్పు.. నేనే వస్తా.. 

కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నావ్‌.. నువ్వు కొనకుండా ఏం పొడుస్తున్నావ్‌ 

సాక్షి నల్లగొండ జిల్లా నెట్‌వర్క్‌:  ‘ముఖ్యమంత్రి ఫాంహౌజ్‌లోనే ఉంటే ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయి? 60 లక్షల టన్నుల ధాన్యం తీసుకుంటామని కేంద్రం చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప టికీ 7 లక్షల టన్నులే కొనుగోలు చేసింది. కేంద్రం ప్రకటించిన రూ.1,960 మద్దతు ధర రైతులకు దక్కకుండా వ్యాపారులకు వంతపాడుతోంది. మీరే ధాన్యం కొంటే కొనుగోలు కేంద్రాల్లో నాకేం పని. రైతుల కోసం ఎందాకైనా.. ఎంతవరకైనా వస్తా. సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని జైలుకు పంపండం పక్కా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాల బావి వద్ద, తిప్పర్తిలో, మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను.. వేములపల్లి మండలం శెట్టిపాలెం పరిధిలోని రైస్‌మిల్లు వద్ద పరిస్థితిని పరిశీలించారు. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు
ఆయన మాటల్లోనే.. 

ధాన్యం కొనేదెప్పుడు? 
‘చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్‌.. నేడు ధాన్యం కొనబోమని చెప్ప డం దుర్మార్గం. నా కొడకా నీ కొడకా అని మాట్లాడడం కాదు. ఆరు ముక్కలుగా నరుకుతా అన్నావు.. ఎప్పుడో చెప్పు.. నేనే వస్తా.. నీ రాళ్ల దెబ్బలకు వెనుకడుగు వేయం. వడ్లు, పత్తి, మక్కలు, కం దులు కేంద్రమే కొంటుంది. నువ్వు కొనుగోలు చేయకుండా ఏం పొడుస్తున్నావ్‌..? లక్ష కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొంటున్నామని ఒక మంత్రి చెప్తున్నారు. ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని మరో మంత్రి అంటున్నారు. గతేడాది కోటీ 40లక్షల టన్నుల ధాన్యం కొన్నామంటున్నారు. మరి ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలే సరిగా ప్రారంభించలేదు. ఇక ధాన్యం కొనేదెప్పుడు? ధాన్యం కోసం బస్తాలు, హమాలీ ఖర్చులతోపాటు అన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. పైగా ధాన్యం కొనుగోలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 2శాతం కమిషన్‌ కూడా ఇస్తుంది. అయినా కొనకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారు? 

యాసంగిలో వరి వేయండి 
యాసంగిలో వరిసాగుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులపై రైతులు ఆందోళన పడొద్దు. ఎలాంటి అనుమానాలూ లేకుండా వరి సాగు చేయండి. కేంద్రమే కొంటుంది. వచ్చే ఏడాది వరికి మద్దతు ధర పెంచుతాం. రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు