దుబ్బాకలో చుక్కలు చూపించాం : సంజయ్‌

9 Nov, 2020 19:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు హిందువుల ఓట్లును ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అనుకూల ప్రాంతాల్లో హిందువుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. ప్రజలను నమ్మించడంలో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడంలో టీఆర్ఎస్ నేతలు ఆరితేరిపోయారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఎలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయిని ప్రశ్నించారు. నగరాన్ని ఎంఐఎంకి అప్పగించి.. హైదరాబాద్‌ని ఏం చేద్దామని అనుకుంటున్నారని నిలదీశారు. ఎంఐఎం నేతలకు ప్రగతి భవన్‌లో ఎప్పుడు వెళ్లినా అపాయింట్ మెంట్ దొరుకుతుందని, తెలంగాణ మంత్రులకు మాత్రం అపాయింట్మెంట్ దొరకదని ఎద్దేవా చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో బండి సంజయ్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఒక్కో డివిజన్లలో 45 నుంచి 50 వేల ఓట్లు ఉన్నాయి. బోలక్ పూర్ 79 నుంచి 93 పోలింగ్ బూతుల్లో 5 వేల ముస్లిం ఓట్లను పెంచారు. అంబర్ పేట 140 నుంచి 150 పోలింగ్ బూతుల్లో ముస్లిం ఓట్లు 4 వేలు పెంచారు. చాంద్రాయణగుట్ట ఉప్పుగూడాలో 50 శాతం హిందువులు ఉంటే.. 45 శాతానికి తగ్గించారు. 5 వేల హిందువుల ఓట్లు తొలగించారు. బోరాబండలో 26 వేల హిందువుల ఓట్లను తొలగించారు. గోశామహల్లో 52357 ఓట్లు ఉంటే.. 15 వేల ఓట్లు తొలగించారు. 62 డివిజన్లో ఇలాగే ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర పన్ని ఓట్లు తొలగించారు.

నెల రోజుల నుంచి ఎన్నికల సంఘాన్ని కలవడానికి టైం అడిగితే టైం ఇవ్వడం లేదు. ఎన్నికల సంఘం చట్టానికి అతీతం కాదు. ప్రజలు తిరగబడతారు. బీజేపీ అభ్యంతరాలు పరిష్కారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దు. ఒక వర్గం ఓట్లతోనే అధికారంలోకి వచ్చారా ? అన్ని వర్గాలను సమానంగా ప్రభుత్వం చూడాలి. టీఆర్ఎస్., ఎంఐఎంకు ఎందుకు దాసోహం అయ్యింది. నాళాలు, చెరువులు ఆక్రమించింది టిఆర్ఎస్ నేతలే. కేంద్రం ఎక్కడి నుంచి డబ్బులు తెస్తుంది, పాకిస్తాన్ నుంచి ముద్రించి తేవాలా ?. పథకాల అమలుకు కేంద్రం నిధులు ఇస్తుంది. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారికి ఎన్నికల్లో పోటీచేయించడానికి కేసీఆర్ జీవో తెచ్చారు. ముఖ్యమంత్రి కుట్రలను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా. హైదరాబాద్లో పాదయాత్ర చేస్తాం. దుబ్బాకలో చుక్కలు చూపించాం. దుబ్బాకలో విజయం సాధించబోతున్నాం.’ అంటూ వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు