కేసీఆర్‌ను ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్‌

7 Aug, 2022 08:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ముఖం లేకే సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్లకుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమ ర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో ఏనాడు కేంద్రంలో అధికారిక మీటింగ్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపని కేసీఆర్, తన రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ పార్టీలతో సమావేశాల కోసమో.. లేదంటే డాక్టర్ల వద్ద చికిత్స కోసమో మాత్రమే ఢిల్లీ వెళ్లారని శనివారం సంజయ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు.

ప్రజల సంక్షేమం కోసం చర్చించేందుకు ఏనాడైనా ఢిల్లీ వెళ్లారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కోరినంత డబ్బులు ఇస్తే నీతి ఆయోగ్‌ మంచిది.. లేదంటే మంచిది కాదా అని నిలదీశారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే.. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై అందులోనే మాట్లాడవచ్చు కదా? అని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్రం రూ.5 వేల కోట్లు కూడా ఇవ్వలేదని చెబుతున్న కేసీఆర్, 5 రోజులు ఢిల్లీలో ఉండి కేంద్రాన్ని బెదిరించి రూ.10 వేలు కోట్లు అప్పు సాధించానని చెబుతున్నారని, మరి కేంద్రం నిజంగా డబ్బులివ్వకపోతే ఏడాది నుంచి ఏం చేసినట్లని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్రం రూ.5 వేల కోట్ల కంటే ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే అసెంబ్లీ ముందు కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా? అని నిలదీశారు. నీతి ఆయోగ్‌ అద్భుతమని నిన్నటిదాకా పొగిడిన కేసీఆర్‌కు నేడు ఆ సంస్థ చేదైందని అన్నారు.

సుప్రీం వ్యాఖ్యలతో కేంద్రానికేం సంబంధం 
ఓట్ల కోసం ఉచితాలను ఇస్తూ ఆర్థిక వ్యవస్థ ను ఛిన్నాభిన్నం చేయడం వల్ల శ్రీలంక వంటి పరిస్థితి వస్తుందని, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు చేసిన వ్యా ఖ్యలతో కేంద్రానికి ఏం సంబంధం అని సంజయ్‌ ప్రశ్నించారు. సుప్రీం సూచనను కేంద్రానికి అంట గట్టడం కేసీఆర్‌ అవివేకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దేశంలో కంపెనీల ఎన్పీఏల గురించి మాట్లాడే ముందు హైదరాబాద్‌లో వేల పరిశ్రమలు ఎందుకు మూతపడ్డాయో కేసీఆర్‌ సమాధానం చెప్పా లని నిలదీశారు. బతుకమ్మ చీరలు కూడా హైదరాబాద్‌లో తయారు చేయించడం చేతగాక సూరత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు రైతు చట్టాలను విమర్శిస్తున్న కేసీఆర్‌.. ఆనాడు ఎందుకు సమర్థించారో సమాధానం చెప్పా లని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్మలకు కారకుడైన కేసీఆర్‌ కేంద్రాన్ని విమర్శించడం సిగ్గుచేట న్నారు. కేసీఆర్‌ తనకు ఇష్టమొచ్చినట్టు అన్నింటినీ బహిష్కరిస్తున్నారని, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్‌ను బహిష్కరించే రో జులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా?

మరిన్ని వార్తలు