అధికారికంగా ‘విమోచన’! 

6 Sep, 2020 04:23 IST|Sakshi

బీజేపీ అధ్యక్షుడు బండి డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తాము 22 ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్‌ కూడా విస్మరించారన్నారు. కేసీఆర్‌ సర్కార్‌.. మజ్లిస్‌పై ప్రేమతో తెలంగాణ అమరవీరుల త్యాగాలను విస్మరిస్తోందన్నారు. ఈనెల 17న అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని లేకుంటే.. బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. ఈనెల 7 నుంచి 17 వరకు పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.  
ఆదుకోవాలన్న సోయిలేదా?.. 
 ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని సంజయ్‌ పేర్కొ న్నారు. వారిని ఆదుకోవాలన్న సోయి ప్రభు త్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు