సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన పని లేదు: బండి సంజయ్‌

4 Jul, 2022 11:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్‌ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు కేసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారు. మోదీని ఎదుర్కోడానికి ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్. నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. కేసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతం అయింది. కేసీఆర్ తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ. తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు