గడీల రాజ్యం పోయి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి:  బండి సంజయ్

24 Apr, 2022 15:07 IST|Sakshi

నారాయణపేట: సీఎం కేసీఆర్ పెద్ద మోసకారి.. కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖర్ రావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆయన  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 11వ  రోజు నారాయణపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే మరింత దిగజారిపోయాయని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో పేదలు విసిగిపోయారని, కేసీఆర్‌ను దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఫాంహౌజ్‌కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండమని దుయ్యబట్టారు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చని కానీ కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదని అన్నారు. కేంద్రం నిధులిస్తే.. కేసీఆర్ దారి మళ్లించిండు. ఈరోజు వ్యాక్సిన్‌ను ఉచితంగా మోదీ అందించడంవల్లే  అందరం కలిసి మాట్లాడుకోగలుతున్నామని తెలిపారు.

ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోయి గరీబోళ్ల ప్రభుత్వం రావాలన్నారు.  బాంచన్ బతుకులు కావాలా? పేదల ప్రభుత్వం రావాలన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే ఏం చేసిండు?, ఆత్మహత్యలు ఆగినయా?, నీళ్లు వచ్చినయా?, బస్టాండ్ వచ్చిందా? ఏం సాధించామని అన్నారు. అమెరికా పోయి బార్లలో, పబ్బుల్లో తిరిగేటోడికి ఈ రోజు రాష్ట్ర మంత్రి అయ్యారంటే అది బీజేపీ వేసిన భిక్ష అని తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి రాష్ట్రాన్ని తెచ్చింది సుష్మా స్వరాజ్ అని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు