విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదు: పెద్దిరెడ్డి

12 Jul, 2021 14:05 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే లెట్రెయిట్‌కి అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనూ లెట్రెయిట్‌ లీజులు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు తవ్వితే లెట్రెయిట్‌.. ఇప్పుడు తవ్వితే బాక్సైట్‌ అవుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాకే శాశ్వతంగా బాక్సైట్‌ తవ్వకాల జీవోలు రద్దు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపామని తెలిపారు. 

అక్రమంగా 2 లక్షల టన్నులు తవ్వినందుకు రూ.20 కోట్ల జరిమానా వేశామన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మైనింగ్‌ ప్రాంతానికి టీడీపీ నేతలు వెళ్తే ఏమొస్తుందని ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. వాళ్లేమన్నా మైనింగ్‌ను నిర్ధారించే నిపుణులా అని నిలదీశారు. ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు