బెంగాల్‌లో ఉద్రిక్తత.. పోలీసులతో బాహాబాహీకి దిగిన బీజేపీ కార్యకర్తలు

13 Sep, 2022 12:18 IST|Sakshi

కోల్‍కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. రాష్ట్రంలో  మమత బెనర్జీ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా నాబన్న అభియాన్‌(సచివాలయ ముట్టడి) పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చింది కమలం పార్టీ. దీంతో బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున కోల్‍కతా చేరుకునేందుకు రైల్వే స్టేషన్లకు తరలివెళ్లాయి.

అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేసి నిలువరించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఫలితంగా రాణిగంజ్‌ రైల్వే స్టేషన్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ తలెత్తింది. అనంతరం పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

దుర్గాపూర్ రైల్వే స్టేషన్లో 20 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ నేత అభిజిత్ దత్తా ఆరోపించారు. తాను మాత్రం ఎలాగోలా తప్పించుకుని వేరే మార్గంలో కోల్‌కతా వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు పోలీసుల తీరును కమలం పార్టీ నేత రూప గంగూలీ తప్పుబట్టారు. శాంతియుత నిరసనలకు అనుమతించి శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అణచివేతకు దిగుతున్నారని మండిపడ్డారు. 

ఉత్తరకొరియాలా మార్చారు..
బెంగాల్ ప్రతిపక్షనేత, మాజీ టీఎంసీ నాయకుడు సువేందు అధికారి కూడా మమత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్‌ను ఉత్తర కొరియాలా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు పోలీసుల చర్యను టీఎంసీ నేత మనోజిత్ మండల్ సమర్థించారు. అసలు బీజేపీ ఎందుకు ఆందోళనలు చేస్తోందని ప్రశ్నించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి విషయాలపై నిరసన చేపట్టాలని సూచించారు.


చదవండి: అనూహ్యం.. అటార్నీ జనరల్‌గా మళ్లీ ఆయనే!

మరిన్ని వార్తలు