బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలతో జాగ్రత్త.. కాంగ్రెస్‌ ఉనికికే ప్రమాదం

22 Nov, 2022 08:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ లేకుండా చేసేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ పాల్పడుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీపీ సీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండకపో­తే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందన్నారు. సోమవారం గాంధీ­భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, అధ్యక్షులతో జరిగిన భేటీలో రేవంత్‌ పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ప్రజా సమస్యలపై పోరాడాలి
పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని, అందరం సహచరులమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో అనుబంధ సంఘాల పాత్ర కీలకమని చెప్పారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్‌ ప్రణాళికపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని, అందరం బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నాటకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, అజారుద్దీన్, కోదండరెడ్డి, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్‌.. ఒకేసారి 50 బృందాలతో..

మరిన్ని వార్తలు