గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలే

15 Mar, 2021 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై ప్రసంగంలో పసలేదు, స్పష్టత లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్నర్‌ ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గన్‌పార్క్‌ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అరేళ్లుగా చెప్పిందే చెప్తున్నారని, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 57 ఏళ్లు దాడినవారి పెన్షన్లు ఇస్తామని చెప్పారని, కొత్త రేషన్‌ కార్డు ఇవ్వలేదన్నారు. క్రాంగ్రెస్‌ హయాంలో బియ్యంతో పాటు 9 రకాల సరుకలు ఇచ్చేశాళ్లం అన్నారు. నిరుద్యోగ భృతికి విధి విధానాలు రూపొందించలేదని, లక్షా 39 వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీరు ఎవరికి ఇస్తున్నారని, మునుగోడు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో నీరు రావట్లేదన్నారు. 

సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భగీరథ నీటిపై విసిరిన సవాల్‌ను స్వీకరించిన, కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్, నాగార్జున సాగర్ నుంచి రావాల్సిన నీరు రావట్లేదన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని అడ్వకేట్ దంపతుల హత్య పట్టపగలే జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాలు నవ్వులాటగా మారాయని, బడ్జెట్‌పై చర్చ కేవలం ఆరు రోజులే నిర్వహించటం దారుణమన్నారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదని భట్టి ప్రశ్నించారు.

అలాగే ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. కరోనాకు సరైన ట్రీట్‌మెంట్‌ చేయట్లేదని గతంలో గవర్నరే చెప్పారు, మళ్లీ ఆ గవర్నర్‌తోనే కరోనాకు మంచి ట్రీట్‌మెంట్‌ చేసినట్లు చెప్పుకున్నారన్నారని విమర్శించారు. 60 ఏళ్లలో చేయని అప్పులు టీఆర్‌ఎస్‌ చేసిందని, కేసీఆర్‌ను పొగడటానికే గవర్నర్ ప్రసంగం సాగిందని మండిపడ్డారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం సమయంలోనే 18 రోజులు అసెంబ్లీ నడిపారన్నారు. బైంసా ఘటనలో బాధిత బాలికకు న్యాయం చేయాలని, హైదరాబాద్‌లో హత్యలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అనంతరం గవర్నర్‌ సభను పొడిగించాలని కోరుతున్నామని ఆమె పేర్కొన్నారు. 

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 50 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ తెచ్చారు కానీ ఆ పథకం 50 శాతం కూడా విజయం సాధించలేకపోయిందన్నారు. ప్రపంచంలో ఎక్కువ ఫ్లోరైడ్‌తో బాధపడిన ప్రాంతం మునుగోడని, అక్కడ ఇంకా భగీరథ నీరు అందటం లేదని ఆరోపించారు. సీమాంధ్ర నాయకులకే మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారని, దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో ఓడిపోయినా ప్రభుత్వ తీరు మారలేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రి తీరు బాగలేదని, సీఎం కేసీఆర్ కుటుంబం ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళ్ళాలన్నారు. ఇక కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మట్లేదని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు