సోనియాగాంధీ నిర్ణయాన్ని అందరూ అమోదించాలి: భట్టి 

13 Jul, 2021 18:20 IST|Sakshi

హైదరాబాద్‌:  కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కౌషిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాని  సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ నిర్ణయాన్ని పార్టీలోని అందరూ ఆమోదించాలని అన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ భావజాలాన్ని, విధానాలను అమలు చేయడం కోసం పార్టీలోని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని సూచించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్‌పై ఆరోపణలు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అభాండాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌ శాసనసభలో కౌషిక్‌ రెడ్డికి వచ్చిన 61,121 ఓట్లన్నీ కాంగ్రెస్‌ ఓట్లేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. హుజూరాబాద్‌కు జరిగే ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఓట్లు చీలినా.. స్థిరమైన ఓట్ బ్యాంక్‌తో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందనడంలో సందేహం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు