ఆస‍్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది: భట్టి

11 Aug, 2020 18:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యశాఖలో ఉన్న లోపాలు బయటకు వస్తాయనే భయంతోనే సీఎం కేసీఆర్‌ కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించడంలేదని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైద్యశాఖకు నిధులు విడుదల చేయండని, ప్రైవేటు హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న మంత్రి ఈటలకు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడ టెస్ట్‌ కిట్స్‌ లేవని చెబుతున్నారు.. 1,82,000 కోట్ల రూపాయల బడ్జేట్‌ ఉన్న రాష్ట్రంలో వైద్యం గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

మానవత్వం లేని పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కోరత కూడా తీవ్రంగా ఉందని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రుల రేట్లను ప్రభుత్వమే ఫిక్స్‌ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలని, 17 మంది అధికారులను.. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియమించాలని భట్టి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు