మహాగట్బంధన్ వైపే మొగ్గుచూపుతున్న ఎగ్జిట్ పోల్స్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ తాజాగా విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాగట్ బంధన్ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బిహార్లోని మొత్తం 243 సీట్లకు జరిగిన మూడు విడతల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85- 95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 65-75 సీట్లు దక్కే అవకాశం ఉండగా, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కానున్నట్లు వెల్లడించింది.
కాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశమున్నట్లు సర్వేలో వెల్లడైంది. పట్నా,నలందాతోపాటు వాయువ్య భోజ్పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలో వెల్లడైంది. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 పోలింగ్ స్టేషన్లలో పీపుల్స్ పల్స్ – పీఎస్జీ సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇక బిహార్ లోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఖ్య 25 శాతం. లింగ నిష్పత్తితోపాటు కుల,మత, వయస్సుల వారీ సమాన ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించింది.(చదవండి: జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు)
పీపుల్స్ పల్స్- పీఎస్జీ సర్వే: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్-2020 ముఖ్యాంశాలు
బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు- ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
పీపుల్స్ పల్స్: మహాగట్ బంధన్కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం
టైమ్స్ నౌ - సీ ఓటర్ : ఆర్జేడీ కూటమికే మొగ్గు
ఇండియా టుడే సర్వే: మధ్యప్రదేశ్ ఉపఎన్నికలు
బిహార్ 2015 ఫలితాలు