హవ్వా! మస్కా కొట్టకు మంత్రీజీ

17 Oct, 2020 13:45 IST|Sakshi

బిహార్‌ మంత్రిని ఏకిపారేస్తున్న నెటిజన్లు

పట్నా: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌ మంత్రి సురేష్‌ కుమార్‌ శర్మ నవ్వులపాలయ్యారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌, హౌజింగ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ముజఫర్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముజఫర్‌పూర్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నాని చెబుతూ సురేష్‌ చేసిన ట్వీట్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ముజఫరాపూర్‌  లైట్‌ యోజనా’ అంటూ ఓ ఫొటో షేర్‌ చేసిన ఆయన.. భారీ వ్యయంతో నిర్మించిన రోడ్లపై 17,554  వీధి దీపాలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీతో పాటు ఉన్న పోస్టర్‌ తయారు చేయించి ట్విటర్‌లో పోస్టు చేశారు. 

అయితే, మంత్రి షేర్‌ చేసిన రోడ్డు, స్ట్రీట్‌ లైట్ల ఫొటో ఫేక్‌ అని తేలింది. రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ద్వారా విషయం బయటపడటంతో నెటిజన్లు మంత్రిని ఏకి పారేస్తున్నారు. ఆయన షేర్‌ చేసింది హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ అని పేర్కొంటూ.. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ను సురేష్‌కు ట్యాగ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్‌ ఫొటోలతో మస్కా కొట్టిస్తావా అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా, బైరామల్‌గూడ జంక్షన్‌ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఆగస్టు 9న ప్రారంభించారు. 780 మీటర్ల వెడల్పైన ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణ వ్యయం 26.5 కోట్లు.

మరిన్ని వార్తలు