ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది

31 Jan, 2021 05:14 IST|Sakshi

తమిళనాడు ఎన్నికలపై  బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

మదురై: తమిళనాడులోని అధికార ఏఐఏడీఎంకేతో తమ పొత్తు కొనసాగుతుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని వెల్లడించారు. శనివారం మదురైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో తమిళనాడు వివక్షకు గురైందంటూ  బీజేపీ హయాంలో ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. మోదీ డిఫెన్స్‌ కారిడార్‌ వంటి ప్రాజెక్టులతోపాటు అవసరమైన మేర నిధులను తమిళనాడుకు మంజూరు చేశారన్నారు. ప్రత్యేక వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక వారసత్వం తమిళుల సొంతమన్నారు. మదురైని భక్తిభూమి అని ఆయన అభివర్ణించారు. ఇక్కడి మీనాక్షి ఆలయంతో మహాత్మాగాంధీకి ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీనాక్షి ఆలయాన్ని సందర్శించుకున్నారు. పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొని, ఎన్నికల్లో గెలుపునకు అవకాశం ఉన్న స్థానాలపై చర్చించారు.

మరిన్ని వార్తలు