‘మునుగోడు ఫలితం రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తుంది’

4 Nov, 2022 08:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేస్తుందని, తమ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. డబ్బు, మద్యం ఏరులుగా పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమే నన్నారు. తమ విజయంతో బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌ల ‘ఖేల్‌ఖతం’కానుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారని ధ్వజ మెత్తారు. పోలింగ్‌ ప్రకియను సక్రమంగా జరపకుండా ఈసీ కూడా తప్పుచేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రధానాధికారి పూర్తిగా కేసీఆర్‌ జేబు మని షిగా మారారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

రాచకొండ కమిషనర్, నల్లగొండ జిల్లా ఎస్పీ టీఆర్‌ఎస్‌కు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఏడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్‌ కొనసాగించి అవినీతి, అక్రమాలకు అవకాశం కల్పించినందుకు పోలీస్‌ కమిషనర్‌ తోపాటు జిల్లా ఎస్పీ కేసీఆర్‌కు గులాంగిరీ చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రలోభాలపై తాము పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. డబ్బు పంపిణీ చేసిన వారిలో 42 మందే దొరికారని అధికారులు పేర్కొనడం విడ్డూ రంగా ఉందన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసు ల పక్షపాత వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తామన్నారు. పోలింగ్‌పై టీఆర్‌ఎస్‌ ఫేక్‌ సర్వేలను ప్రచారంలోకి తెచ్చిందని మండిపడ్డారు. 
చదవండి: పెరిగిన ఓటింగ్‌ శాతం.. బీజేపీ ఏమంటోంది?

వెయ్యికోట్లు ఖర్చుచేశారు..
వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్‌ వస్తుందో రాదోనన్న భయంతో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా మునుగోడులో రూ.వెయ్యికోట్లకు పైగా ఖర్చు చేశారని సంజయ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నెల రోజులుగా మునుగోడు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర రూపాల్లో ప్రలోభాలకు గురిచేసిందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు అంబులెన్స్‌లు, పోలీసు వాహ నాల్లో పెద్దమొత్తంలో డబ్బులు తరలిస్తే పోలీసులు సహకరించారన్నారు.

కేసీఆర్‌ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఓటుకు రూ.30 వేలు ఇచ్చినా, బంగారు బిస్కెట్లు ఇచ్చినా ప్రజలు బీజేపీనే గెలిపించబోతున్నారని పేర్కొన్నారు. తమకు అనుకూలమైన పోలీసు అధికారుల లిస్ట్‌ తయారు చేసుకుని వాళ్లకు డ్యూటీ వేసి బీజేపీ నేతలు, కార్యకర్తలను కొట్టించారని, చండూరులో విచక్షణారహితంగా కొట్టారని ధ్వజమెత్తారు.

ఓటుకు రూ.50 వేలు ఇచ్చిండు
‘ఒక గ్రామంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు ఓటుకు రూ.50 వేలిచ్చిండు. ఒక్క గ్రామానికే రూ.20 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకుంటున్నారంటే.. ఏ స్థాయిలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించారో అర్థమవుతోంది. పోలింగ్‌ జరుగు తున్న టైంలోనే ట్విట్టర్‌ టిల్లు.. రంగంతండా, హాజినా తండా ప్రజలకు ఫోన్‌ చేసి అన్ని విధాలా ఆదుకుంటామని ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్ని కల నిబంధనలను ఉల్లంఘించారు’ అని సంజయ్‌ మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు