ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే.. జాగా ఉంటే రూ.5 లక్షలిస్తానని మాట తప్పినవ్‌ 

1 Dec, 2022 07:56 IST|Sakshi

ఇచి్చన హామీ ప్రకారం డబ్బులివ్వాల్సిందే 

రుణమాఫీ ఏమైంది.. పంట నష్టపరిహారం ఎటుపోయింది 

పుట్టబోయే బిడ్డ మీదా రూ.లక్ష అప్పు చేసినవ్‌ 

నీ పాలనలో పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు 

గుండెగాం చూస్తే గుండె తరుక్కుపోతోంది 

వానొస్తే టీఆర్‌ఎస్‌ నేతలను ఇక్కడ కట్టేయండి 

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ 

మూడోరోజు ముధోల్‌ నియోజకవర్గంలోనే యాత్ర

నిర్మల్‌: ‘‘కేసీఆర్‌.. అసెంబ్లీలో లెంపలేసుకో. సొంత ఇంటిజాగా ఉన్నవాళ్లందరికీ రూ.5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినవ్‌. మాట తప్పి ఇప్పుడు రూ.3లక్షలే ఇస్తామంటున్నవ్‌. మాట తప్పి తప్పు చేశానంటూ అసెంబ్లీ సాక్షిగా లెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలి. నీ పాలనలో పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. పుట్టబోయే బిడ్డపైనా రూ.లక్షకుపైగా అప్పు చేసినవ్‌. నీకు పేదలంటే మంట. వానొస్తే మునిగిపోతున్న గుండెగాంను చూస్తే గుండె తరుక్కుపోతోంది.

సమస్య తీరే దాకా ఈ సర్కారుపై పోరాడుదాం. ఈసారి వాన వచి్చనప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలను తీసుకొచ్చి ఇక్కడ కట్టేయండి. మీ కష్టమేందో కేసీఆర్‌కు అప్పుడు తెలుస్తది..’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. బుధవారం ప్రజాసంగ్రామ యాత్ర నిర్మల్‌ జిల్లా భైంసా మండలం గుండెగాం, మహాగాం, కుభీర్‌ మండలం చాత మీదుగా లింబా(బి) శివారుకు చేరుకుంది. 

మా ఊరు తెలంగాణలో లేదా.. గుండెగాం వాసుల గోస 
‘‘వర్షం వస్తే మా పరిస్థితిని మాటల్లో కూడా చెప్పలేం. గత ఏడేళ్లుగా పునరావాసం కోసం తిప్పలు పడుతున్నాం. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే మమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు. ప్రశి్నస్తే మమ్మల్ని పోలీస్‌స్టేషన్లో వేస్తున్నారు. గుండెగాం గ్రామం తెలంగాణలో లేదా..? ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. బండి సంజయ్‌ వస్తున్నాడంటే... టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు రెండుసార్లు సర్వే చేశారు’’అంటూ గుండెగాం వాసులు తమ గోస వినిపించారు.

నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని పల్సికర్‌ రంగారావ్‌ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామమైన గుండెగాం హనుమాన్‌ ఆలయం వద్ద గ్రామస్తులతో బండి సంజయ్‌ రచ్చబండ నిర్వహించారు. గుండెగాం ప్రజల గోస వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. కేసీఆర్‌ కమీషన్ల కోసం ప్రగతిభవన్, సచివాలయం కట్టుకుంటడు, కాళేశ్వరం కడతడు, కానీ కమీషన్లు రావని గుండెగాం ప్రజలను గాలికొదిలేసిండని మండిపడ్డారు. గుండెగాం ప్రజలు బాధపడొద్దని, బీజేపీ      అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

ఎన్ని హామీలు అమలు చేసినవ్‌.. 
సీఎం కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచి్చన హామీలేవీ అమలు కాలేదని బండి సంజయ్‌ ఆరోపించారు. భైంసా మండలంలోని మహాగాంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే వాటిని దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్‌ అని విమర్శించారు. రుణమాఫీ, డబుల్‌ బెడ్రూం, నిరుద్యోగ భృతి, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి సహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదని ఆరోపించారు.

ఇప్పుడు ఎన్నికల గడువు దగ్గర పడుతుండడంతో కొత్త డ్రామాలకు తెరదీశాడన్నారు.చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్‌ నోటికి మాటలు ఎక్కువన్నారు. కల్వకుంట్ల ఇంట్లోనే ముఖ్యమంత్రి పీఠం కోసం లొల్లి మొదలైందని సంజయ్‌ ఆరోపించారు. దోచుకున్న సొమ్మును పత్తాలు, డ్రగ్స్, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో పెడుతున్నారని మండిపడ్డారు. 

విద్యార్థులనూ పొట్టనబెట్టుకుంటున్నరు.. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వడ్ల కుప్పలపై రైతన్నలతోపాటు విద్యార్థులు సైతం ప్రాణాలను కోల్పోతున్నారని బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం మూల్యాంకనంలో చేసిన నిర్వాకం వల్ల సిరిసిల్లలో ఓ విద్యారి్థని ఆత్మహత్య చేసుకుందన్నారు. 37 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ గడీలో తెలంగాణ తల్లి బందీ అయిందని, ఆ తల్లిని బంధ విముక్తి చేసేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నామని, ప్రజలంతా బీజేపీ వెంట ఉండాలని బండి సంజయ్‌ కోరారు.
చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. 5 గంటల పాటు వాడీవేడిగా వాదనలు

మరిన్ని వార్తలు