రాష్ట్రపతి పాలన?!: బీజేపీ నేత వ్యాఖ్యల కలకలం

8 Apr, 2021 16:08 IST|Sakshi

15  రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుంది

అవినీతి  మంత్రులకు వ్యతిరేకంగా కోర్టుకు 

 ప్రెసిడెంట్‌రూల్‌కి  సమయం

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన అధికారం  చేపట్టింది మొదలు బీజేపీ, శివసేన మధ్య  ఏదో ఒక రూపంలో విభేదాల సెగలు రగులుతూనే  ఉన్నాయి.   తాజాగా  స్థానిక బీజేపీ నేత  శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధి(ఎంవీఏ)  సర్కార్‌పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న పదిహేనురోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం ఖాయమని, దాంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం రానుందంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. కొంతమంది ఈ మంత్రులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతారు, ఇక ఆ తరువాత సదరు మంత్రులు వైదొలగవలసి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ మంత్రులు ఎవరనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో వాజ్‌ను సర్కార్‌ భారీగా వెనకేసుకొచ్చిందని ఆరోపించారు. దీంతో  అసెంబ్లీని తొమ్మిది సార్లు వాయిదా వేయాల్సి ఉందని కూడా ఆయన గుర్తు చేశారు.  శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ కూటమి రాష్ట్రంలో వ్యవస్ధీకృత నేరాలకు పాల్పడుతోందంటూ పాటిల్‌ ధ్వజమెత్తారు. (అనిల్‌ దేశ్‌ముఖ్‌ 2 కోట్లు అడిగారు)

అవినీతి ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా నేపథ్యంలో , మరిన్ని అవినీతా ఆరోపణలతో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుందని బీజేపీ చంద్రకాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన దిశగా  రాష్ట్రంలో  పరిణామాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. తాను సర్వీసులో కొన సాగాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మాజీ రాష్ట్ర హోంమంత్రి, ఎన్‌సీపీకి చెందిన అనిల్ దేశ​ముఖ్ డిమాండ్‌ చేశారని సస్పెన్షన్‌కు గురైన ముంబై మాజీ పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే ఆరోపించిన క్రమంలో చంద్రకాంత్‌ పాటిల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలుచేయాలని మరో మంత్రి అనిల్ పరాబ్ కోరారంటూ వాజే  ఒక లేఖ రాసిన సంగతి  తెలిసిందే. (ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు)

కాగా ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించడంతో సోమవారం రాష్ట్ర హోంమంత్రి పదవికి  అనిల్‌దేశ్‌ముఖ్‌ రాజీనామా చేశారు. 

మరిన్ని వార్తలు